ప్రాజెక్టుల వద్ద జలదీక్షలకు పిలుపునిచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేపట్టిన ప్రాజెక్టులను తెరాస ప్రభుత్వం పూర్తి చేయడం లేదని వారు ఆరోపించారు. ఈ క్రమంలో నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గొడుకొండ్ల వద్ద జలదీక్షకు కాంగ్రెస్ నేతలు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డితో పాటు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డిని పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేశారు.
కాంగ్రెస్ నేతలు జలదీక్షలు చేయకుండా పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా చర్యలు తీసుకున్నారు. కొడంగల్లోని రేవంత్రెడ్డి నివాసం వద్ద పోలీసులు మోహరించారు. ఇంట్లోంచి బయటకు రాకుండా గృహనిర్బంధం చేశారు. అయితే, కొడంగల్లో రేవంత్ రెడ్డి అనుచరుల ఆందోళనలతో ఉద్రిక్తత నెలకొనడంతో రేవంత్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.