ఐదేళ్ల వ్యవధిలో ఎన్నో అవరోధాలను అధిగమించగలిగామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలో సీఎం పాల్గొన్నారు. పతాకావిష్కరణ అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తూ.. తెలంగాణ ప్రగతిపథంలో దూసుకుపోతుంది. ప్రభుత్వం పట్టుదలతో సాధించిన విజయం ఇది. రాష్ట్రం కోసం రాజీలేని పోరాటం చేసిన వాళ్లే అభివృద్ధి చేస్తారని ప్రజలు నమ్మారు. పంచాయతీ నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు తిరుగులేని విజయం కట్టబెట్టారు. రాజకీయ అవినీతికి దూరంగా బలమైన రాష్ట్రంగా నిలదొక్కుకుంది. ఐదేళ్లలో రాష్ట్రం 16.5 శాతం వృద్ధిరేటు సాధించిందన్నారు. దేశ చరిత్రలో ప్రత్యేక మహోద్యమాన్ని సాగించి తెలంగాణ సాధించుకున్నాం.
ఆయా కులాల ఆత్మగౌరవ భవనాలను హైదరాబాద్లో నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. అతి తక్కువ కాలంలో విద్యుత్ సమస్యను అధిగమించామన్నారు. వ్యవసాయం సహా అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామన్నారు. మంచినీటి సమస్య పరిష్కారం కోసం మిషన్ భగీరథ సఫలం అవుతోందన్నారు. వేసవిలోనూ తాగునీటి కోసం మైళ్ల దూరం వెళ్లే బాధలు తప్పాయన్నారు. దళారుల ప్రమేయం లేకుండా ఆసరా పింఛన్లు నేరుగా లబ్దిదారులకే అందుతున్నాయన్నారు. వృద్ధ్యాప్య పింఛన్ల వయోపరిమితిని 65 నుంచి 57 ఏళ్లకు తగ్గించినట్లు తెలిపారు. పెంచిన పింఛన్లు జులై నుంచి అమలు చేస్తామన్నారు.