ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి, మాజీ ఐపీఎస్ అధికారి వి.వి.లక్ష్మీనారాయణ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ 85 నుంచి 125 మధ్య సీట్లు సాధించి జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు. ప్రజల్లోని నిశ్శబ్ద విప్లవం జనసేనకు మేలు చేయనుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. రాష్ట్ర పౌరుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జనసేన రూపొందించిన మేనిఫెస్టో ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తోందని చెప్పారు. విశాఖ సమస్యలను గుర్తించానని తెలిపారు. ముఖ్యంగా నగర ప్రజలు తీవ్ర నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నీటి సమస్యను తీర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు ప్రజలకు వివరించినట్టు తెలిపారు.