ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల పునర్వర్గీకరణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటివరకు మూడు రకాలుగా ఉన్న పంచాయతీలను, ఇకపై జనాభా, వార్షిక ఆదాయం ఆధారంగా నాలుగు కేటగిరీలుగా విభజించింది.
ఇందులో భాగంగా పట్టణ లక్షణాలు సంతరించుకుంటున్న పెద్ద గ్రామాలను గుర్తిస్తూ కొత్తగా ‘రూర్బన్’ (రూరల్ + అర్బన్) పంచాయతీ కేటగిరీని ప్రవేశపెట్టింది.
గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన పరిపాలన, పౌర సేవలు అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.
ఈ కొత్త వర్గీకరణ ప్రకారం రూర్బన్ పంచాయతీలలో పట్టణాలకు దీటుగా మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు.
రూర్బన్ పంచాయతీ: 10 వేలకు పైగా జనాభా, రూ.కోటి కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉండాలి. గిరిజన ప్రాంతాల్లో అయితే 5 వేలకు పైగా జనాభా ఉంటే సరిపోతుంది.
ఈ పంచాయతీలలో పట్టణ తరహా సౌకర్యాలు కల్పిస్తారు.
గ్రేడ్-1 పంచాయతీ: 3 వేల నుంచి 10 వేల మధ్య జనాభా, రూ.30 లక్షల నుంచి రూ.కోటి లోపు వార్షిక ఆదాయం ఉండాలి. గిరిజన ప్రాంతాల్లో 2,500 నుంచి 5 వేల మధ్య జనాభా ఉండాలి. మండల కేంద్రంగా ఉన్న పంచాయతీలు ఈ గ్రేడ్ కిందికి వస్తాయి.
గ్రేడ్-2 పంచాయతీ: 2 వేల లోపు జనాభా ఉండాలి. గిరిజన ప్రాంతాల్లో జనాభా 1,500 నుంచి 2 వేల మధ్య ఉండాలి.
గ్రేడ్-3 పంచాయతీ: 1,500 కంటే తక్కువ జనాభా ఉన్న పంచాయతీలను ఈ కేటగిరీలో చేర్చారు.
ఈ నూతన వర్గీకరణతో పంచాయతీలకు వాటి జనాభా, ఆదాయ వనరులకు అనుగుణంగా నిధుల కేటాయింపు, అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన సులభతరం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
పెద్ద గ్రామాల్లో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా సేవలు అందించేందుకు ఈ వ్యవస్థ దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

