భారత 15వ రాష్ట్రపతిగా తిరుగులేని మెజారిటీతో ఎన్నికైన ద్రౌపది ముర్ము(64) జీవన ప్రస్థానం అందరికి స్పూర్తి..రాష్ట్రపతి పీఠాన్ని అధిష్ఠించబోతున్న మొదటి గిరిజన నాయకురాలిగా, రెండో మహిళగా ద్రౌపది చరిత్ర సృష్టించారు. ఈ పదవిని చేపడుతున్న అతి తక్కువ వయసున్న వ్యక్తి కూడా ఆమే.
విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై విజయం సాధించిన ఆమె.. జులై 26న రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
64 ఏళ్ల ద్రౌపది ముర్ము ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా ఉపర్బెడా గ్రామంలో 1958 జూన్ 20న నిరుపేద కుటుంబంలో జన్మించారు. జన్మించారు. ఆమె తండ్రి పేరు బిరంచి నారాయణ్తుడు. అనేక కష్టాలకు ఓర్చి భువనేశ్వర్లోని రమాదేవి మహిళా కళాశాలలో డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆడపిల్లవు చదువుకొని ఏం చేస్తావని బంధువులంతా నిరుత్సాహ పరచినా ఆమె పట్టుదలతో చదువును కొనసాగించారు.
బ్యాంకు ఉద్యోగి శ్యాంచరణ్ ముర్మును ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. 2009లో 25 ఏళ్ల వయస్సులో చిన్న కుమారుడు లక్ష్మణ్ మరణించినపుడు ఆమె డిప్రెషన్కు గురయ్యారు. మిత్రులతో విందుకు వెళ్లిన లక్ష్మణ్ను అపస్మారక స్థితిలో ఇంటికి తీసుకొచ్చారు. పైకి దెబ్బలు ఏమీ కనిపించకపోవడంతో సీరియ్సగా తీసుకోలేదు. మర్నాడు ఉదయం లేచి చూసేసరికి గదిలో మరణించి ఉన్నాడు. తర్వాత 2013లో పెద్ద కుమారుడు రోడ్డు ప్రమాదంలో, 2014లో భర్త గుండెపోటుతో మరణించడం ఆమె జీవితంలో అత్యంత విషాదకర ఘట్టం..
ద్రౌపది ముర్ము కుమార్తె ఇటిశ్రీ ముర్ము(35) పుణెలో ఎంబీఏ చదివి భువనేశ్వర్లో బ్యాంకు మేనేజర్గా పని చేస్తున్నారు. 2015లో వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. తల్లి రాష్ట్రపతిగా ఎన్నికయ్యాక బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.
కెరీర్ ఆరంభంలో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు ద్రౌపది ముర్ము. అనంతరం బీజేపీలో చేరి పార్టీలో తనదైన ముద్రవేశారు. వివాదాలు లేని నాయకురాలిగా గుర్తింపు పొందారు. పార్టీ అగ్రనేలతో పాటు ప్రజల మన్ననలను పొందారు. 1997లో కౌన్సిలర్గా ఆమె ఎన్నికయ్యారు. అనంతరం రాయ్రంగపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఒడిశాలోని భారతీయ జనతా పార్టీ, బిజూ జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వం సమయంలో మార్చి 6, 2000 నుంచి ఆగస్టు 6, 2002 వరకు వాణిజ్య, రవాణా మంత్రిగా పనిచేశారు. ఆగస్టు 6, 2002 నుంచి 2004 మే వరకు మత్స్య, జంతు వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా సేవలందించారు. 2010, 2013లో మయూర్భంజ్ బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నారు. 2013లో బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యనిర్వాహక సభ్యురాలిగా ద్రౌపది ముర్ము పనిచేశారు. ఆ తర్వాత ఝార్ఖండ్ 9వ గవర్నర్గా రాజ్యాంగ పదవి చేపట్టారు. 2015 నుంచి 2021 వరకు ఝార్ఖండ్ గవర్నర్గా సేవలందించారు. ఇప్పుడు ఏకంగా రాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యారు. ఆ పదవి వరించిన తొలి ఆదివాసీ బిడ్డగా చరిత్ర సృష్టించారు.
ఢిల్లీలో ముర్ము తాత్కాలిక నివాసానికి ప్రధాని నరేంద్రమోదీ, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా వెళ్లి అభినందనలు తెలిపారు. రక్షణ మంతి రాజ్నాథ్సింగ్, హోంమంత్రి అమిత్షా ఆమె నివాసానికి వెళ్లి మిఠాయి తినిపించారు.
మరోవైపు రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము విజయం సాధించడంతో… ఒడిశాలోని ఆమె స్వగ్రామంలోని పండగ వాతావరణం నెలకొంది. ఊరంతా సంబరాలు చేసుకున్నారు. ద్రౌపది ముర్ము స్వగ్రామం మయూర్భంజ్ జిల్లా ఉపెర్బెడా. ముర్ము తల్లిదండ్రులు ఇక్కడే ఉండేవారు. ఆ తర్వాత రాయ్రంగ్పూర్ పట్టణానికి వెళ్లి స్థిరపడ్డారు. ఐనప్పటికీ ఉపెర్బెడాలో ముర్ము తండ్రి పేరు మీద ఓ ఇల్లు ఉంది. అందులో ముర్ము మేనల్లుడు నివసిస్తున్నారు. తమగ్రామానికి చెందిన మహిళ.. భారత రాష్ట్రపతిగా ఎన్నికవడంతో.. ఊరి ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వీట్లు పంచి వేడుక చేసుకున్నారు.