జనవరి 26వ తేదీన మరో అపూర్వ ఘట్టానికి ప్రజా రాజధాని అమరావతి ప్రధాన వేదిక కానుంది.
తొలిసారి గణంతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకునేందుకు సిద్దమవుతోంది. రాజధాని ప్రాంతం నడిబొడ్డున తొలిసారి జరగబోయే వేడుకలకు శరవేగంగా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి.
పరేడ్ గ్రౌండ్, సహా ప్రధాన వేదిక పనులు వేగంగా జరుగుతున్నాయి. వేడుకల నిర్వహణ ద్వారా రాజధానికి ప్రాభవం పెరిగేలా సరికొత్త నిర్ణయాలను తీసుకుని ప్రభుత్వం అమలు చేస్తోంది.
గత ప్రభుత్వం మసకబార్చిన అమరావతి వైభవాన్ని పునరుద్దరించేలా కూటమి సర్కార్ కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ఓ వైపు పాలనను పరుగులు పెట్టిస్తూనే మరోవైపు నిర్మాణాలనూ పరుగులు పెట్టిస్తోంది.
ఏడాదిన్నరలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల భవన సముదాయాల నిర్మాణాలను దాదాపు పూర్తి చేసిన సర్కారు ప్రభుత్వ భవన సముదాయాల నిర్మాణాలను ప్రారంభించి శరవేగంగా పనులను చేస్తోంది.
అమరావతిలో జరగబోయే రిపబ్లిక్ డే వేడుకల ఏర్పాట్లను మంత్రి నారాయణ పరిశీలించారు. 22 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్, వీవీఐపీ, వీఐపీ పార్కింగ్కు 15 ఎకరాలు, పబ్లిక్ పార్కింగ్కు 25 ఎకరాలను ఏర్పాటు చేశారు.
అమరావతి రైతులకు ప్రత్యేకంగా వీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేశారు. వేడుకలకు హాజరుకావలసిందిగా రైతులకు అధికారులు ఆహ్వానపత్రికలు పంపుతున్నట్లు మంత్రి తెలిపారు.
రిపబ్లిక్ వేడుకలకు అమరావతి సిద్ధమవుతోందని నారాయణ ఈ సందర్భంగా వెల్లడించారు. మొదటిసారి నవ్యాంధ్ర రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్డు సమీపంలో మంత్రుల బంగ్లాల ఎదురుగా పెరేడ్ గ్రౌండ్ను ఏర్పాటు చేశారు.

