జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 104 సీట్లు గెలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న టీఆర్ఎస్ బహిరంగ సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ముందుకు వెళుతుందని చెప్పారు. గత 60 ఏళ్లలో ఎన్నడూ లేని అభివృద్ధి చేసి చూపించామని పేర్కొన్నారు. నగరంలోనూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు తలసాని. రోడ్లు, ఫ్లైఓర్లు, అండర్ పాస్లు, పార్కులు ఇలా చాలా అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. కరోనా, వరదల సమయంలోనూ ప్రజలను ఆదుకుంది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. నగరానికి వస్తున్న కేంద్ర మంత్రులు హైదరాబాద్ అభివృద్ధిపై మాట్లాడకుండా టీఆర్ఎస్పైనే విమర్శలు చేస్తున్నారని తలసాని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హైదరాబాద్ నగరానికి ఏం చేశాయో చెప్పాలని మంత్రి తలసాని డిమాండ్ చేశారు.
next post
అందుకే బీజేపీ ప్రభుత్వం ఆటలు సాగుతున్నాయి: చిదంబరం