తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 8, 9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారు.
ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ఢిల్లీ పార్లమెంట్ భవన్ ప్రధానమంత్రి గారి కార్యాలయంలో మోదీ తో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి ప్రత్యేకంగా ముద్రించిన ఆహ్వాన పత్రికను అందజేశారు.
కేంద్ర ప్రభుత్వ నిర్దేశిత వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా, తనవంతుగా తెలంగాణ దేశ ఆర్థిక ప్రగతిలో తోడ్పాటును అందించాలన్న సంకల్పంతో తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక పత్రం రూపొందించినట్టు ముఖ్యమంత్రి గారు వివరించారు.
వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోవడంలో 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలని సమగ్రమైన ప్రణాళికలతో రోడ్ మ్యాప్ను రూపొందించినట్టు చెప్పారు.

