బీహార్ రాజధాని పాట్నాలో దారుణం జరిగింది. 21 ఏండ్ల మహిళ ఆరు నెలల గర్భవతి. శనివారం రాత్రి భోజనం తర్వాత నడక కోసం ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ముగ్గురు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేశారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. కాగా, నడక కోసం బయటకు వెళ్లిన గర్భిణీ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారుపడి ఆమె కోసం వెతికారు.
అత్యాచారం తర్వాత తనను లోకల్ ట్రైన్ ఎక్కించాలని బాధిత మహిళ నిందితులను ప్రాధేయపడింది. దీంతో ఆదివారం ఉదయం 4 గంటలకు ఇద్దరు ఆమెను పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్ను తీసుకువచ్చారు. ఒక వ్యక్తి టికెట్ తీసుకునేందుకు వెళ్లగా ఆ మహిళ ఏడుస్తుంటాన్ని రైల్వే స్టేషన్లోని ప్రయాణికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు ఆమె వద్దకు రాగా, జరిగిన విషయాన్ని బాధితురాలు చెప్పింది. దీంతో రైల్వే స్టేషన్లో ఉన్న ఇద్దరు నిందితులు అంకిత్ కుమార్ (19), విశాల్ కుమార్ (21)ను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడు శ్యామ్ కుమార్ కోసం గాలిస్తున్నారు.
బాధితురాలి ఫిర్యాదుతో మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ముగ్గురు నిందితులు బాధిత మహిళ ఉండే కాలనీకి చెందిన వారేనని, వారు కూలీ పనులు చేస్తుంటారని మహిళా పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారిణి తెలిపారు. మేజిస్ట్రేట్ సమక్షంలో బాధితురాలి వాంగ్మూలాన్ని తీసుకుంటామని చెప్పారు.