మాములుగా ఎవరి ఇంట్లోనైనా దొంగలు పడితే పోలీస్ స్టేషన్ కు వెళ్తారు. కానీ అదే పోలీస్ స్టేషన్ లో దొంగతనం జరిగితే ఎక్కడికి వెళ్తారు. తాజాగా ఏపీలో ఏకంగా ఓ పోలీస్ స్టేషన్లోనే సొమ్మును కాజేశారు. అసలు ఏం జరిగిందంటే… పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పోలీస్ స్టేషన్లో నగదు ఎత్తుకెళ్లారు.. పీఎస్లో నగదు ఏంటి? అనే ప్రశ్న రావొచ్చు… వరుసగా నాలుగు రోజులు బ్యాంక్ సెలవులు కావడంతో మద్యం షాపుల సొమ్మును పోలీస్ స్టేషన్లో ఉంచారు సిబ్బంది… వీరవాసరం మండలంలోని నాలుగు మద్యం షాపులకు సంబంధించిన సొమ్మును పోలీస్ స్టేషన్లో ఉంచగా.. అందులో.. రూ.8 లక్షలు మాయం అయ్యాయి.. ఇక, మళ్లీ బ్యాంకులు ఓపెన్ కావడంతో.. డిపాజిట్ చేసేందుకు మద్యం షాపుల సిబ్బంది లెక్కలు తీయగా.. నగదు తగ్గిపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్లోనే చోరీ కావడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.. రూ.8 లక్షలు చోరీకి పాల్పడింది ఆ పీఎస్లో పనిచేసే ఇద్దరు కానిస్టేబుళ్లేనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇప్పటికే చోరీకి పాల్పడినవారిని గుర్తించారు పోలీసులు. కానీ పోలీస్ స్టేషన్ లో దొంగతనం జరగడంతో ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది.
previous post
next post