విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ నుంచి గ్యాస్ లీకేజీ ఘటన నేపథ్యంలో వస్తోన్న వదంతులను ప్రజలు నమ్మొద్దని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. గ్యాస్ లీక్ అయిన ప్రాంతంలో ప్రస్తుతం ఉష్ణోగ్రత బాగా తగ్గిందని ఆయన అన్నారు. ఆసుపత్రుల్లో సుమారు 500 మంది ఉన్నారని, వారిని చికిత్స అందుతోందని చెప్పారు.
పరిస్థితిని ఏడుగురు మంత్రులు సమీక్షిస్తున్నారని ఆయన మీడియాకు తెలిపారు. స్టైరిన్ వాయువును చాలా జాగ్రత్తలు తీసుకుని నియంత్రించాల్సి ఉంటుందని అవంతి చెప్పారు. ఆ పరిశ్రమ ఉన్న ప్రాంతంలోని వారంతా రెండు రోజుల పాటు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. ఐదు గ్రామాల ప్రజలు 48 గంటల పాటు పునరావాస కేంద్రాల్లో ఉండాలని ఆయన సూచించారు.