వైసీపీ అధినేత జగన్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ నేతలు టీఆర్ఎస్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో టీఆర్ఎస్ ఎంపీ కవిత వేసిన కేసు ప్రతిని టీడీపీ విడుదల చేసింది. పోలవరం పై మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ ..ఏపీ అభివృద్ధిని అడ్డుకునే విధంగా పోలవరం ప్రాజెక్టు పనులను ఆపాలంటూ సుప్రీంకోర్టులో టీఆర్ఎస్ ఎంపీ కవితతో సహా పలువురు నేతలు కేసులు వేశారని చెప్పారు. సుప్రీంకోర్టులో ఈ కేసులు నడుస్తున్నాయని పేర్కొన్నారు.
ఒడిశాతో చేతులు కలిపి పోలవరం ప్రాజెక్టును అడ్డుకొనేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందని దేవినేని ఆరోపించారు. ఏపీ నుండి విద్యుత్ను ఉపయోగించుకొని తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు డబ్బులు ఇవ్వడాన్ని గురించి పట్టించుకోలేదు అన్నారు. కేటీఆర్తో చర్చల సందర్భంగా విద్యుత్ బకాయిల చర్చల విషయం ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని దేవినేని ప్రశ్నించారు. పోలవరంకు వ్యతిరేకంగా లోక్ సభ, రాజ్యసభల్లో కూడా పలు ప్రశ్నలను లేవనెత్తారని దుయ్యబట్టారు. దీనిపై వైసీపీ అధినేత జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.జగన్ తనపై ఉన్న కేసుల నుండి బయటపడేందుకు కేసీఆర్తో కుమ్మక్కయ్యారని దేవినేని ఆరోపించారు.