ప్రజలంతా వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. కరోనాపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ కరోనా విషయంలో ఎవరూ భయపడొద్దని చెప్పారు. మహమ్మారి విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదని,తగు జాగ్రత్తలను పాటించాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 67 శాతంగా ఉందని చెప్పారు.
తీవ్రమైన జబ్బులు ఉన్న 200 మంది మినహా మిగిలిన అందరూ కోలుకుంటున్నారని తెలిపారు. వివిధ ఆసుపత్రుల్లో 3,692 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. 9,636 మంది హోం క్వారంటైన్ లో ఉన్నారని చెప్పారు. గాంధీ ఆసుపత్రి, టిమ్స్ లో 3 వేల బెడ్లను ఆక్సిజన్ సదుపాయాలతో సిద్ధం చేశామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ సౌకర్యం ఉన్న బెడ్లు 5 వేల వరకు అందుబాటులో ఉన్నాయని అన్నారు.
జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య తక్కువగా ఉందని కేసీఆర్ తెలిపారు. వైద్య, ఆరోగ్య సిబ్బందితో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 10 శాతం అదనపు వేతనాన్ని ఇవ్వాలని ఆదేశించారు. బెడ్ల అందుబాటు విషయంలో ప్రైవేట్ ఆసుపత్రులు పారదర్శకంగా వ్యవహరించాలని హెచ్చరించారు.