టెన్త్ పరీక్షల నిర్వహణపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్గానే పరిగణించాలని ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ హైకోర్టుకు నివేదించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి విచారణకు హాజరయ్యారు. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని పిటిషనర్ స్పష్టం చేశారు.పంజాబ్ తరహాలో పరీక్షలు లేకుండానే విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వాలని కోరారు. పరీక్షలు లేకుండా గ్రేడింగ్ ఇస్తే ఇబ్బందేంటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
జీహెచ్ఎంసీ, రంగారెడ్డి మినహా ఇతర జిల్లాల్లో పరీక్షలు నిర్వహించాలని సూచించింది. రాష్ట్రంలో వేర్వేరుగా పరీక్షలు నిర్వహించడం కష్టమని అడ్వొకేట్ జనరల్ పేర్కొన్నారు. ప్రశ్నపత్రం మళ్లీ మళ్లీ తయారుచేయడం ఇబ్బంది అవుతుందని ఆయన వివరించారు. విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమా, సాంకేతిక అంశాలు ముఖ్యమా అని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వాన్ని సంప్రదించి చెబుతామని ఏజీ తెలిపారు. తదుపరి విచారణను సాయంత్రం 4 గంటలకు కోర్టు వాయిదా వేసింది.