సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఏపీలో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. రాయలసీమలో ఎన్నికల సందర్భంగా అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం వీరాపురంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో టీడీపీకి చెందిన సిద్ధా భాస్కర్ రెడ్డి, వైసీపీకి చెందిన పుల్లారెడ్డి నిన్న మృతి చెందారు. ఆ ఘటనలో గాయపడిన టీడీపీ కార్యకర్త చింతా భాస్కర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మరణించాడు.
టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య జరిగిన దాడిలో చింతా భాస్కర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ నేడు మరణించాడు. దీంతో వీరాపురంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులో ఉంచడానికి భారీగా పోలీసులను మోహరించారు. ముఖ్యంగా, టీడీపీ, వైసీపీ నేతల నివాసాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వీరాపురం చేరుకుని స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఘటనలో మరో టీడీపీ కార్యకర్త మృతి చెండంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్తితి నెలకొంది.