సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార టీడీపీలో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు నిరాకరిస్తుంటే, మరికొందరు నామినేషన్ వేసి నా వల్లకాదంటూ చేతులెత్తేస్తున్న పరిస్థితి ఎదురవుతోంది. ఇటీవలే శ్రీశైలం అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఏకంగా తాను రాజకీయాలకే గుడ్ బై చెప్తున్నానని ప్రకటించగా, పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి తెర్లాం పూర్ణం పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. తాజాగా కడప జిల్లా బద్వేల్ నియోజకర్గం టీడీపీ అభ్యర్థి రాజశేఖర్ నామినేషన్ దాఖలు చేసి తాను బరిలో నిలవలేనని తేల్చిచెప్పారు.
దీంతో కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది. బద్వేల్ నియోజకవర్గం టీడీపీ తరఫున బరిలోకి దిగారు డాక్టర్ రాజశేఖర్ శుక్రవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. టీడీపీ నుంచి విజయజ్యోతి రెబల్ అభ్యర్థిగా పోటీ చెయ్యడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటంతో పోటీ నుంచి తప్పుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ఇకపోతే టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ విజయజ్యోతి శుక్రవారం టీడీపీ రెబల్గా నామినేషన్ వేశారు. దీంతో విజయజ్యోతి ఇక టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.