మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు శివసేన అష్టకష్టాలు పడుతుంది. బీజేపీ ని కాదని రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన చేసిన ప్రయత్నాలు సఫలమవుతున్నాయి. మరాఠా పీఠంపై శివసేన – ఎన్సీపీ – కాంగ్రెస్ నేతృత్వంలో సరికొత్త కూటమి కొలువుదీరేందుకు దాదాపు కసరత్తు పూర్తయింది. శివసేన కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా ఉండాలని ఎన్సీపీ, కాంగ్రెస్ కోరుతున్నట్టు సమాచారం. మంత్రి పదవుల పంపకంపై మూడు పార్టీల్లోనూ ఇంకా ఎలాంటి స్పష్టతా రానట్టు సమాచారం. అయితే, మూడు పార్టీలకూ సరి సమానంగా మంత్రి పదవులు పంచాలని కాంగ్రెస్ కోరుతున్నట్టు తెలుస్తోంది. గురువారం కాంగ్రెస్ నేతలు దిల్లీలోని ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో భేటీ అయి.. కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పాటుపై మరోసారి చర్చించారు. మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను శనివారం గవర్నర్కు అందజేస్తామని శివసేన నేత సంజయ్ రౌత్ ఈ రోజు వ్యాఖ్యానించారు.
అంతా అనుకున్నట్టు జరిగితే, ఆది లేదా సోమవారాల్లో ప్రమాణస్వీకారోత్సవం జరిగే అవకాశం ఉందని సేన వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో మంత్రి పదవులను సమంగా పంచుకోవాలని కాంగ్రెస్ కోరుతున్నట్టు తెలుస్తోంది. ఎన్సీపీ కూడా సీఎం పదవిని ఉద్ధవే చేపట్టాలని కోరినట్టు సమాచారం. ఉద్ధవే సీఎంగా ఉండాలని తమ పార్టీ ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారని శివసేన శాసనసభాపక్ష నేత ఏక్నాథ్ షిందే పేర్కొన్నారు. ముంబయిలో రేపు జరగబోయే కాంగ్రెస్ నేతలతో సమావేశానికి ముందే శివసేన ఎమ్మెల్యేలను జైపూర్కు తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.