అయోధ్యపై నిర్ణయమేదైనా..అందరూ సంయమనం పాటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ట్వీట్ ద్వారా పిలుపునిచ్చారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదం ఒక ముగింపుకు వచ్చే సమయం ఆసన్నమైంది. అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమి – బాబ్రీ మసీదు వ్యాజ్యంపై తుది తీర్పు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. 2019, నవంబర్ 09వ తేదీ శనివారం ఉదయం 10.30కి ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరిస్తుంది. ఈ సందర్భంగా మోడీ ట్వీట్ చేశారు.
సుప్రీంకోర్టు అయోధ్య కేసులో ఎలాంటి నిర్ణయాన్ని వెలువరించినా..దానిని ఏ ఒక్క వర్గానికో గెలుపు ? లేదా ఓటమి ? అనే కోణం నుంచి చూడనే కూడదు. శాంతి సామరస్యాల పరిరక్షణణ, సుహృద్బావం అనేది మన సుసంపన్న సంప్రదాయం. అయోధ్యపై సుప్రీంకోర్టు నిర్ణయం ఈ అత్యున్నత సంప్రదాయాన్ని మరింత పరిపుష్టం చేసేలా చూడడం మనందరి ప్రప్రథమ ప్రాధాన్యం కావాలి. దేశ ప్రజలందరికీ అదే నా అభ్యర్థన. తీర్పు అనంతరం కూడా మైత్రి, సయోధ్యలను చక్కగా కాపాడుకోవాలి. సాంస్కృతిక సంస్థలు గత కొన్ని రోజులుగా ఎంతో కృషి చేస్తున్నాయి. సర్వోన్నత న్యాయస్థానంలో ఈ కేసు విచారణ..జరిగినంత కాలం..సమాజంలోని అన్ని వర్గాలూ సుహృద్బావ పరిస్థితులు కొనసాగేలా చేసిన కృషి అభినందనీయమని మోడీ ట్వీట్ చేశారు.