కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ప్రవేశ పెట్టడం పట్ల ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ట్రిపుల్ తలాక్ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఇది రాజ్యాంగంలోని 14, 15వ అధికరణలను ఉల్లంఘించడమేనని అన్నారు. ఇప్పటికే ముస్లిం మహిళా వివాహ చట్టంతో పాటు సీఆర్పీసీ సెక్షన్ 125, గృహహింస చట్టం 2005 ఉన్నాయని తెలిపారు.
మూడుసార్లు తలాక్, తలాక్, తలాక్ అని చెప్పి విడాకులు ఇవ్వడాన్ని నేరంగా పేర్కొంటూ కేంద్రం ట్రిపుల్ తలాక్ బిల్లు పెట్టడంతో మహిళలు ఇబ్బందులకు గురవుతారని అన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లు చట్టంగా మారితే మహిళలకు అంతకంటే అన్యాయం మరొకటి ఉండదని ఒవైసీ వివరించారు. ఇదేం న్యాయమో ప్రధాని మోదీయే చెప్పాలని డిమాండ్ చేశారు.