తెలంగాణలో పది పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకొంది. ఓపెన్లో చదివే టెన్త్, ఇంటర్ విద్యార్థులందరినీ పాస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులందరికీ 35 మార్కులను ఇవ్వాలని చెబుతూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో ఓపెన్ స్కూల్, ఇంటర్ విద్యార్థులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా వ్యాప్తి దృష్ట్యా ఓపెన్ స్కూల్, పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని ఓపెన్ స్కూల్స్ సొసైటీ డైరెక్టర్ ఎస్ వెంకటేశ్వర వర్మ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ విద్యార్థులందరన్నీ పాస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో పదో తరగతిలో 35 వేల మంది విద్యార్థులు, ఇంటర్లో 43 వేల మంది స్టూడెంట్స్ పై తరగతులకు వెళ్లనున్నారు.