ఇటీవల అటు తెలుగు రాష్ట్రాలు, ఇటు జమ్మూకశ్మీర్ రాష్ట్రాల విభజన ఇప్పటికే ప్రత్యేక రాష్ట్రాలను కోరుతున్న వారి ఆశలకు రెక్కలనిచ్చాయి. దీనితో చిన్నరాష్ట్రాల ఏర్పాటు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇందుకోసం ఏళ్లుగా పోరాడుతున్న కొత్త రాష్ట్రాల జాతీయ సమాఖ్య (ఎన్ఎఫ్ఎన్ఎస్) నేతలు ఉద్యమాన్ని తీవ్రతరం చేయనున్నారు. ఇటీవల జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని విభజించి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడం తమ ఉద్యమాన్ని మరింత ప్రోత్సహించిందని ఎన్ఎఫ్ఎన్ఎస్ సభ్యులు తెలిపారు. ఈ మేరకు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలన్న ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ)కి డిమాండ్కు మద్దతుగా త్రిపుర రాజధాని అగర్తలకు 25 కి.మీ.దూరంలో ఉన్న కుముల్వంగ్లో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు.
త్రిపుర లోని ట్రైబల్ ఏరియాస్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ (టీటీఏఏడీసీ)ను ప్రత్యేక రాష్ట్రం చేయాలని ఐపీఎఫ్టీ 2009 నుంచి పోరాడుతోంది. ఈ భారీ ర్యాలీకి మేఘాలయ సీఎం సంగ్మా, ఎన్ఎఫ్ఎన్ఎస్ ప్రధాన కార్యదర్శి మనీశ్ తమాంగ్ వంటి నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. జమ్మూకశ్మీర్ను విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రత్యేక రాష్ట్రాల కోసం పోరాడుతున్న ఎన్ఎఫ్ఎన్ఎస్ సభ్యుల్లో ఉత్సాహాన్ని నింపిందని ఐపీఎఫ్టీ సహాయ ప్రధాన కార్యదర్శి మంగల్ దెబ్బర్మ తెలిపారు. జమ్మూకశ్మీర్ రాష్ట్ర విభజనను దృష్టిలో ఉంచుకుని భారీ ఎత్తున ఈ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఏళ్లుగా బోడో ల్యాండ్, గోర్ఖాల్యాండ్, త్రిపురాల్యాండ్, విదర్భ తదితర ప్రాంతాలను ప్రత్యేక రాష్ట్రాలు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.