మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ-శివసేన కూటమి ఇంకా ఓ కొలిక్కి రానట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే అధ్యక్షతన శాసనసభాపక్ష సమావేశం నిర్వహించింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఏక్నాథ్ షిండేను శివసేన శాసనసభాపక్ష నేత ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం విదితమే. ఇక ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు ఎమ్మెల్యేలు ఏక్నాథ్ షిండే, ఆదిత్య థాకరే, దివాకర్ రౌతే, సుభాష్ దేశాయి కలిసి మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశారీని కలవనున్నారు. 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 105 సీట్లను గెలుచుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే ఆ పార్టీ 17 సీట్లను కోల్పోయింది. శివసేన 56 సీట్లను గెలుచుకుంది. 17మంది బీజేపీ రెబల్స్ గెలువడంతో వారి మద్దతు తమకే ఉంటుందన్న ధీమాతో ఉన్న బీజేపీ శివసేన డిమాండ్లను పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.