టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆ పార్టీ ముఖ్యనేతలతో యూరప్ నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీలో ఏర్పడిన తాజా రాజకీయ పరిస్థితిపై చర్చించారు. నేతలు తాజా పరిణామాలను చంద్రబాబుకు వివరించారు. ఇక, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సమావేశం చివర్లో రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
గంటా వచ్చిన వెంటనే తాజా పరిణామాలను చంద్రబాబుకు వివరించిన ఆయన, ఆ తర్వాత కొన్ని ఇతర విషయాలను మీతో వ్యక్తిగతంగానే మాట్లాడతానంటూ అధినేతతో చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, నలుగురు రాజ్యసభ ఎంపీలు టీడీపీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో, గంటా శ్రీనివాసరావు కూడా పార్టీకి గుడ్ బై చెబుతారంటూ వైసీపీ నేత అవంతి శ్రీనివాస్ పేర్కొనడం ఆ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.