ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో మండలంలో విధి నిర్వహణలో ఉన్న అటవీ అధికారులపైఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే భద్రాద్రిలో మరో ఘటన జరిగింది. ములకలపల్లి మండలం గుండాలపాడులో పోడు భూముల్లో సాగు చేయడాన్ని అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. దీంతో అక్కడి గిరిజనులు అటవీశాఖ అధికారులపై దాడి జరిపారు.
ఈ దాడిలో బీట్ ఆఫీసర్ భాస్కర్, సెక్షన్ ఆఫీసర్ నీలమయ్యతో పాటు అటవీశాఖ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం పాల్వంచలోని ఓ ఆసుపత్రికి తరలించారు. దీంతో గుండాలపాడులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అటవీశాఖ సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.