ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉందని అన్నారు. అయితే ఆ నిరసనలు చట్టాలకు లోబడి ఉండాలన్నారు. భావ స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదని, హక్కులు ఉన్నాయని ఏదైనా చేస్తానంటే సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ముట్టడిస్తాం.. దాడులు చేస్తామంటే నేరం కిందకు వస్తుందని, రాజ్యాంగ వ్యవస్థలను హెచ్చరించినట్లవుతుందని చెప్పారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సభ్యులు కానివారిని చట్టసభల్లోకి రాకుండా నిరోధించే అధికారముందన్నారు. సభ్యులు కానివారు ప్రవేశిస్తే శిక్ష విధించే అధికారం అసెంబ్లీకి ఉందన్నారు. చలో అసెంబ్లీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రైతులకు ఏమైనా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి సానుకూలంగా పరిష్కరించుకోవాలని సూచించారు.