పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న గాజువాక, భీమవరంలో చంద్రబాబు ప్రచారం చేయరని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. అధేవిధంగా చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం, లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరిలో జనసేన అధినేత పవన్ ప్రచారం చేయరని జగన్ విమర్శించారు. మంగళవారం మంగళగిరిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లలో ఇచ్చిన హామీలను చంద్రబాబు మరిచారన్నారు. బాబు అధికారంలోకి వచ్చాక హోదా అంశాన్ని వదిలేశారని జగన్ విమర్శలు గుప్పించారు. హోదా వద్దు ప్యాకేజీ చాలంటూ కేంద్రంతో చీకటి ఒప్పందం చేసుకున్నారన్నారు.
అమరావతి చుట్టుపక్కల రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని జగన్ ఆరోపించారు. ఓటర్లను చంద్రబాబు ప్రలోభపెడుతున్నారని జగన్ మండిపడ్డారు.ఓటుకు నోటు కేసులో భయపడి హైదరాబాదు నుంచి చంద్రబాబు పారిపోయి వచ్చారని జగన్ అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వైయస్సార్ ఆసరా కింద ఏడాదికి రూ. 50 వేలు ఇస్తామని చెప్పారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని, రైతులకు ఉచితంగా పంట బీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు.