హైదరాబాద్ కు చెందిన యువకుడు ప్రేమించిన యువతే, తనను వేధిస్తోందని ఆరోపిస్తూ, పోలీసుల ముందు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన లంగర్ హౌస్ పరిధిలో కలకలం రేపింది. ఇక్కడి గొల్లబస్తీలో నివాసం ఉంటూ, డీఎల్ఎఫ్ లో పని చేస్తున్న ఆదిల్ (25) అనే యువకుడు, క్లాస్ మేట్ అయిన యువతి (22)ని నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు.
కొంతకాలం సీక్రెట్ గా ఉన్న ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో తెలియడంతో, ఆమె మాట మార్చింది. ఆదిల్ కు ఫోన్ చేసి దూషించింది. పదే పదే ఆమె ఫోన్ చేసి దూషిస్తుండటంతో మనస్తాపం చెందిన ఆదిల్, లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. అమ్మాయిపై ఫిర్యాదు చేస్తూనే, ఒంటికి నిప్పంటించుకున్నాడు. వెంటనే స్పందించిన పోలీసులు మంటలను ఆర్పి, ఆదిల్ ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆదిల్ ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసి విచారణ ప్రారంభించామని పోలీసులు తెలిపారు. ఆదిల్ కు ప్రాణాపాయం ఏమీ లేదని ఉస్మానియా వైద్యులు తెలిపారు.