దేశంలోనే మొట్టమొదటి సెమీ హైస్పీడ్ ఎక్స్ప్రెస్ రైలు ‘వందే భారత్’ రైలును ఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రధానమంత్రి మోదీ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ప్రారంభించిన మొదటిరోజే రైల్ కు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ, వారణాసి నగరాల మధ్య ప్రయాణించే ఈ రైల్ వారణాసికి బయలుదేరింది. తిరుగుప్రయాణంలో ఢిల్లీకి 200 కిలోమీటర్ల దూరంలోని తుండ్ల వద్ద ఓ గేదెను ఢీకొట్టింది. శనివారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో ఈ రైలు కింద గేదె పడటంతో చివరి బోగీ దెబ్బతింది.
దీంతో రైలును గంట సేపు ఆపినట్లు అధికారులు పేర్కొన్నారు. గేదె కళేబర శకలాలు రైలు చక్రాలను చుట్టుకోవడంతో వాటిని తొలగించి ఉదయం 8.15 గంటలకు ఢిల్లీకి రైలు బయలుదేరిందని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ప్రారంభం మొదటి రోజు ఈ రైలు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడిచిందని రైల్వే అధికారులు చెప్పారు. 17వతేదీ నుంచి ఈ రైలు ప్రయాణికుల కోసం నడపనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.