ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో తెల్దారుపల్లి టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో నిందితుడిగా ఉన్న తమ్మినేని కోటేశ్వరరావు ఇవాళ ఖమ్మం కోర్టులో లొంగిపోయాడు. కోటేశ్వరరావుతో పాటు నాగయ్య అనే నిందితుడు కూడా కోర్టులో లొంగిపోయాడు.
ఏ9, ఏ10 నిందితులు తమ్మినేని కోటేశ్వరరావు, నాగయ్యలు ను పోలీసులు చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే 8 మంది నిందితులు రిమాండ్లో ఉండగా.. వీరితో కలిసి 10 మంది నిందితులు లొంగిపోయినట్లయింది. తమ్మినేని కృష్ణయ్య హత్య జరిగిన రోజు నుండి తమ్మినేని కోటేశ్వరరావు , నాగయ్యలు పరారీలో ఉన్నారు.
సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోదరుడే తమ్మినేని కోటేశ్వరరావు. హత్యకు గురైన తమ్మినేని కృష్ణయ్య తమ్మినేని వీరభద్రం బాబాయి కొడుకే తమ్మినేని కృష్ణయ్య.
సుదీర్ఘకాలం పాటు సీపీఎంలో ఉన్న తమ్మినేని కృష్ణయ్య మూడేళ్ల క్రితంఆ పార్టీని వదిలి టీఆర్ఎస్ లో చేరారు. సర్పంచ్ పదవి విషయమై తమ్మినేని కోటేశ్వరరావు కుటుంబంతో చోటు చేసుకున్న విబేధాల కారణంగానే తమ్మినేని కృష్ణయ్య సీపీఎంను వీడాడు. సర్పంచ్ ఎన్నికల సమయంలో తమ్మినేని కృష్ణయ్య నామినేషన్ దాఖలు చేశాడు. అయితే ఆ సమయంలో కుటుంబ సభ్యులు, బంధవులు సర్ధి చెప్పడంతో కృష్ణయ్య నామినేషన్ ను వెనక్కి తీసుకున్నాడు.
ఎంపీటీసీ ఎన్నికల సమయంలో కృష్ణయ్య నామినేషన్ దాఖలు చేశాడు. అయితే ఈ సమయంలో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో తమ్మినేని కృష్ణయ్య ఇండిపెండెంట్ గా పోటీ చేసి తన భార్యను ఎంపీటీసీగా కృష్ణయ్య గెలిపించుకున్నారు. ఆ తర్వాత తమ్మినేని కృష్ణయ్య టీఆర్ఎస్ లో చేరారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్నారు. దీంతో గ్రామంలో టీఆర్ఎస్, సీపీఎం మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతుంది. గతంలో జరిగిన గ్రామ సభలోనే తమ్మినేని కోటేశ్వరరావు,తమ్మినేని కృష్ణయ్య మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలో ఆగస్టు 15న బైక్పై వెళ్తోన్న తమ్మినేని కృష్ణయ్య దుండగులు ఆటోతో ఢీకొట్టి అనంతరం వేటకొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు. ఈ దాడిలో ఆరుగురు పాల్గొనున్నట్లు తెలుస్తోంది. తెల్దారుపల్లి శివారులోని రోడ్డుపై ఈ దాడి ఘటన జరిగింది.
తమ్మినేని కృష్ణయ్య ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం డైరెక్టర్గా ఉన్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. రాజకీయ కక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితులు మొత్తం పోలీసుల కస్టడీలో ఉండటంతో కేసు విచారణ వేగవంతం కానుంది. పోలీసులు కోర్టుకు కేసు వివరాలు సమర్పించనున్నారు. నిందితులకు త్వరలోనే కోర్టు శిక్ష ఖరారు చేసే అవకాశం ఉంది.