కామారెడ్డి కలెక్టర్ జితేష్ పాటిల్పై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రెండోరోజు పర్యటించారు.
బీర్కూర్లో శుక్రవారం రేషన్ షాప్ను తనిఖీ చేయడానికి వెళ్లిన నిర్మలా సీతారామన్.. ప్రజలకు ఇస్తున్న రేషన్ వివరాలను కలెక్టర్ జితేష్ పాటిల్ను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద ఎంత బియ్యం పంపిణీ చేశారని ప్రశ్నించారు
పేదలకు ఉచితంగా ఇచ్చే రేషన్ బియ్యంలో కేంద్రం వాటా ఎంత? రాష్ట్రం వాటా ఎంత? అని
లబ్ధిదారుల ముందు కలెక్టర్ ను ప్రశ్నించారు.
అయితే కలెక్టర్ తెలియదని సమాధానం చెప్పడంతో.. ప్రజలకు తెలియకపోవడమంటే సరే. .‘కలెక్టర్ అయ్యుండి తెలియదంటారా’ అని నిర్మలా మండిపడ్డారు.
అరగంట సమయంలో రేషన్ బియ్యంలో కేంద్రం, రాష్ట్ర వాటా ఎంతో తెలుసుకుని చెప్పాలని కలెక్టర్ను ఆదేశించారు..పేదలకిచ్చే రేషన్ బియ్యంపై కిలోకు 35 రూపాయల ఖర్చవుతుంటే కేంద్రం 30 రూపాయలు భరిస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు.
రేషన్ బియ్యంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్నప్పటికీ కూడ రేషన్ దుకాణాల వద్ద ప్రధాని నరేంద్ర మోడీ ఫ్లెక్సీలు, లేదా ఫోటోలు ఏర్పాటు చేయకుండా ఎందుకు అడ్డుపడుతున్నారని కేంద్ర మంత్రి కలెక్టర్ ను ప్రశ్నించారు.
రేషన్ షాపుల వద్ద ప్రధాని మోదీ ఫొటోను ఖచ్చితంగా ఉంచాలని, లేకుంటే తానే వచ్చి పెడతానని ఆమె ఫైర్ అయ్యారు. కామారెడ్డి జిల్లాలోనే తెలంగాణ వ్యాప్తంగా ఇదే రకమైన పరిస్థితి నెలకొందన్నారు.
అంతకుముందు బాన్సువాడలో నిర్మాలా సీతారామన్కు నిరసన సెగ తాకింది. బాన్సువాడ అంబేడ్కర్ చౌరస్తా వద్ద నిర్మలా కాన్వాయిను అడ్డుకునేందుకు యూత్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. కార్యకర్తలను పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. కోటగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత టీకా కేంద్రాన్ని నిర్మల తనిఖీ చేశారు.