భక్తులకి మరో శుభవార్త చెప్పింది టీటీడీ. కరోనా క్లిష్టకాలంలోనూ ఆఏడుకొండల వాడి దర్శనంతో పునీతమయ్యే అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది టీటీడీ. స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఆన్లైన్లో అందుబాటులో తేవడంతో.. భక్తుల నుంచి విశేష స్పందన వచ్చింది. దీంతో నవంబర్ ఒకటి నుంచి మరిన్ని సేవలను ఆన్లైన్ ద్వారా భక్తులకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది టీటీడీ. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా తిరుమల కొండపైనా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బ్రహ్మోత్సవాలు,ప్రత్యేక పర్వదినాల సమయంలో మాత్రమే రద్దు చేసే ఆర్జిత సేవలను… కోవిడ్ కారణంగా మార్చి 15 నుంచి నిరవధికంగా రద్దు చేసింది టీటీడీ. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో జూన్ 8 నుంచి పరిమిత సంఖ్యలో భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నా… స్వామివారి ఆర్జిత సేవలను పునరుద్దరించలేదు. నిత్య కైంకర్యాలను మాత్రం యధావిధిగా నిర్వహిస్తోంది.
స్వామివారికి నిర్వహిస్తున్న కళ్యాణోత్సవ సేవలో పాల్గోనే అవకాశం కల్పించాలని భక్తుల నుంచి విజ్ఞప్తులు రావడంతో ..ఆన్ లైన్ ద్వారా కళ్యాణోత్సవం సేవలో పాల్గోనే అవకాశం కల్పించింది టీటీడీ. ఆన్ లైన్ కల్యాణోత్సవ సేవలో పాల్గొనే భక్తులకు శ్రీవారి ప్రసాదమైన అక్షింతలు, రవిక, కండువాను పోస్ట్ ద్వారా పంపిస్తోంది. మొదట్లో కల్యాణోత్సవ సేవలో పాల్గొనే భక్తులను శ్రీవారి మూలవిరాట్టు దర్శనానికి అనుమతించని టీటీడీ. భక్తుల విజ్ఞప్తితో , నవంబర్ ఒకటి నుంచి శ్రీవారి ఉత్సవమూర్తులైన శ్రీదేవి,భూదేవి సమేత మలయప్ప స్వామికీ జరిగే ఆర్జిత సేవలను పునరుద్దరించాలని టీటీడీ నిర్ణయించింది. ఆర్జిత బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్రదీపాలంకార సేవలను వర్చ్యువల్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించింది టీటీడీ.ఈ సేవల టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు.. ఆ టికెట్టుపై శ్రీవారి దర్శనం ఉండదు. దర్శనం కోసం ప్రత్యేక దర్శన టికెట్లు ఆన్ లైన్ లో కొనుగోలు చేయాలని టీటీడీ సూచించింది.