ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు శ్రీనివాసుల రెడ్డి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం పై ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు నిందితుడు ఆత్మహత్య వెనక బోల్డన్ని అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఆత్మహత్యకు ముందు నిందితుడు రాసిన సూసైడ్ లేఖలో రెండు చేతి రాతలు ఉన్నాయన్నారు.
జగన్ అధికారంలోకి వచ్చి వంద రోజులైనా బాబాయిని చంపిన వారిని పట్టుకోలేకపోయారని, ఇక రాష్ట్రాన్ని ఏం కాపాడతారని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 8 హత్యలు జరిగాయని అన్నారు. వందల కుటుంబాలు ఊళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నాయని దుయ్యబట్టారు.