తెలంగాణ – ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ములుగు- బీజాపూర్ జిల్లా లోని తాళ్లగూడెం అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.ఘటనా స్థలం నుంచి ఎస్ఎల్ఆర్, ఎకె47 రైఫిల్లతో పాటు పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు.
ఇటీవల కాలంలో తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టులు కదలికలు ఎక్కువ కావడంతో పోలీసు ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి. అప్పటి నుంచి వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బీజాపూర్, ములుగు సరిహద్దులోని తర్లగూడ వద్ద మావోయిస్టులు పోలీసులకు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మృతుల్లో వాజేడు – వెంకటాపురం ఏరియా కమాండర్గా గతంలో పనిచేసిన సుధాకర్ ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.