telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో క్రేజీ సీక్వెల్ లో కమల్… ఆ ముగ్గురు భామలతో…!

Kamal-Hasan

లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం ‘ఇండియన్‌ 2’ లో నటిస్తోన్న విషయం తెలిసిందే. శంకర్ తెరకెక్కిస్తున్న ‘ఇండియన్‌ 2’లో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా… వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సీక్వెల్‌పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ మూవీ తరువాత మరో సీక్వెల్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నారు. 1992లో వచ్చిన ‘తేవార్‌ మాగన్’ (తెలుగులో క్షత్రియ పుత్రుడు) సీక్వెల్‌ ‘తలైవాన్ ఇరుక్కిన్‌ద్రాన్‌’లో నటించేందుకు కమల్ సిద్ధమవుతున్నారు. ఈ సీక్వెల్‌కి ఆయనే దర్శకత్వం వహించనుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నారు. కమల్ ‘ఇండియన్‌ 2’ను నిర్మిస్తోన్న లైకా ప్రొడక్షన్స్ సంస్థనే ఈ సీక్వెల్‌ను నిర్మించబోతోంది. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన పలు ఆసక్తికర వార్తలు కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీలో విజయ్‌ సేతుపతిని ఓ కీలక పాత్ర కోసం కమల్ ఎంచుకున్నారట. ఇక ఇందులో ముగ్గురు హీరోయిన్లకు అవకాశం ఉండగా.. అందుకోసం ముగ్గురిని ఆయన ఎంచుకున్నారట. ‘తేవార్ మాగన్’‌లో నటించిన రేవతికి కమల్‌ ఇందులో కూడా అవకాశం ఇవ్వగా… మరో రెండు పాత్రలకు గానూ పూజా కుమార్, ఆండ్రియాలను ఆయన ఎంచుకున్నారట. ఈ ఇద్దరు హీరోయిన్లు ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వరూపం’ 1, 2 భాగాల్లో నటించగా… వారిద్దరికి కమల్ మరోసారి అవకాశం ఇచ్చినట్లు టాక్‌. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ‘తేవార్ మాగన్’‌ చిత్రంలో గౌతమి కూడా నటించిన విషయం తెలిసిందే.

Related posts