బీహార్లోని ముజఫర్పూర్ను మెదడువాపు వ్యాధి చిగురుటాకులా వణికిస్తోంది. దీని బారినపడి, చికిత్స పొందుతూ గురువారం ఒక్కరోజే ఐదుగురు చిన్నారులు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు ఈ వ్యాధితో మరణించినవారి సంఖ్య 54కు చేరింది. వాతావరణంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగి, గాలిలో తేమశాతం అధికమవడంతో అక్యూట్ ఎన్సెఫలైటిన్, జేఈలు చాపకింద నీరులా వ్యాపిస్తున్నట్లు వైద్యులు గుర్తించారు.
గత వారం ఒక్కరోజే మెదడువాపు లక్షణాలతో 21మంది చిన్నారులు ఆసుపత్రిలో చేరగా.. మరో 14 మంది కేజ్రీవాల్ ఆస్పత్రిలో చేరారు. ఈ ఘటనపై బీహార్ సీఎం నితీష్ కుమార్ స్పందించారు. ఈ వ్యాధిని అరికట్టేందుకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రత్యేక వైద్య బృందం సమక్షంలో చికిత్స అందుంతుందని వెల్లడించారు.