telugu navyamedia
తెలంగాణ వార్తలు విద్యా వార్తలు

తెలంగాణ టెన్త్ పరీక్ష పేపర్ల కుదింపు

పదో తరగతి పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులు చేయనుంది. ఈ ఏడాది టెన్త్ పరీక్ష పేపర్లను 11 నుంచి 6కి కుదిస్తూ రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. సబ్జెక్టుకు ఒక పరీక్ష చొప్పున ఉండాలని నిర్ణయించారు. ఈ మేరకు టెన్త్ పరీక్షల విధానంపై విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.

పదో తరగతి పరీక్షలకు సమయం అరగంట పెంచాలని అధికారులు నిర్ణయించారు. పదో తరగతి విద్యార్థులకు 3 గంటల 15 నిమిషాల పాటు ఒక్కో పరీక్ష జరగనుంది. సైన్సు పరీక్షలో భౌతిక, జీవశాస్త్రాలకు వేర్వేరు సమాధాన పత్రాలు ఉంటాయి. పశ్నల్లో మరిన్ని ఛాయిస్‌లు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. బోర్డు పరీక్షకు 80 మార్కులు, ఎఫ్‌ఏ పరీక్షలకు 20 మార్కులు చొప్పున కేటాయించనున్నట్టు అధికారులు వెల్లడించారు. పాఠశాల విద్యార్థులకు సిలబస్‌ తగ్గిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఒకటి నుంచి 10 తరగతులకు 70శాతం సిలబస్‌ బోధించాలని నిర్ణయించారు. సిలబస్‌ తగ్గించేందుకు పాఠశాల విద్యాశాఖకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

కరోనా ప్రభావంతో పాఠశాలల్లో ఇంకా పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహించలేని పరిస్థితి. అందుకే పరీక్ష విధానంలో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది పరీక్షలు నిర్వహించలేని పరిస్థితుల కారణంగా పరీక్ష రాయకుండానే అందరినీ ఉత్తీర్ణులను చేసింది. ఈసారి కూడా గతేడాది విధానాన్నే అమలు చేయాలని నిర్ణయించారు. గతేడాది ముందువరకు 11 పేపర్లు నిర్వహిస్తూ వస్తున్నారు. కొత్త విధానం ప్రకారం పదో తరగతి విద్యార్థులకు 6 పరీక్షలే నిర్వహిస్తారు.

Related posts