తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగనున్నాయి. ఈ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికుల నడ్డీ విరగనుంది. టీఎస్ఆర్టీసీ వాస్తవానికి డిసెంబర్ 2వ తేదీ నుంచే ఛార్జీల పెంపు ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టికెట్ ఇష్యూయింగ్ మిషన్స్ (టింస్) లో మార్పులకు ఒకరోజు సమయం పట్టే అవకాశం ఉండటంతో ఛార్జీల పెంపును అధికారులు ఒకరోజు వాయిదా వేశారు.
పెరిగిన ఛార్జీల పట్టికను అధికారులు ఈరోజు విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ అర్ధరాత్రి నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. కిలోమీటర్ కు 20 పైసల వంతున ఛార్జీలు పెరగనున్నాయి. ఛార్జీల పెంపు వల్ల ఏడాదికి రూ. 750 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని భావిస్తున్నారు.