telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

తెలంగాణ హైకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. అత్యాచారానికి గురైన బాలిక దాల్చిన గర్భాన్ని తొలగించేందుకు అనుమతిచ్చింది. పిండం హక్కుల కంటే.. అత్యాచార బాధితురాలికి రాజ్యాంగం కల్పించిన హక్కులే ప్రాధాన్యమని స్పష్టం చేసింది. అత్యాచారానికి గురైన బాలిక అబార్షన్‌కు హైకోర్టు అంగీకరించింది. 26 వారాల పిండాన్ని తొలగించేందుకు అనుమతి ఇచ్చింది. కోఠి ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు హైకోర్టు ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీచేసింది. నిపుణులతో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డి ఈ కీలక తీర్పు వెలువరించారు.

16ఏళ్ల బాలికపై సమీప బంధువు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు ఆసుపత్రిలో పరీక్షలు చేయించగా.. గర్భవతిగా వైద్యులు నిర్ధారించారు. అవాంఛిత గర్భాన్ని తొలగించాలని బాలిక, ఆమె తల్లి కోరగా కోఠి ప్రసూతి ఆసుపత్రి వైద్యులు నిరాకరించారు. దీంతో తల్లి ద్వారా బాలిక హైకోర్టును ఆశ్రయించారు. బాలిక ఆరోగ్యపరిస్థితిపై వైద్యుల కమిటీని ఏర్పాటు చేసిన హైకోర్టు .. నివేదిక సమర్పించాలని ఆదేశించింది. పరీక్షలు జరిపిన వైద్యుల కమిటీ.. పిండం వయసు 25 వారాలుగా తేల్చి.. కొన్ని జాగ్రత్తలతో నిపుణులు అబార్షన్‌ చేయవచ్చని సూచించింది.

వివిధ అంశాలను పరిశీలించిన హైకోర్టు బాలికకు అబార్షన్‌ చేయాలని ఆదేశించింది. గర్భం కోరుకునే హక్కుతో పాటు.. చట్టపరిమితులకు లోబడి వద్దనుకునే హక్కు కూడా ఉంటుందని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దురదృష్ట ఘటనతో వచ్చిన గర్భాన్ని తొలగించకపోతే.. తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడి ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదముందని హైకోర్టు అభిప్రాయపడింది. హుందాగా, ఆత్మగౌరవంతో, ఆరోగ్యకరంగా జీవించే హక్కు మహిళలకు ఉందని తెలిపింది. అన్ని జాగ్రత్తలతో.. అబార్షన్ చేయాలని కోఠి ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించింది. పిండం నుంచి రక్తం, కణజాలం, డీఎన్ఏ సేకరించి ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపించాలని హైకోర్టు తెలిపింది. ఫోరెన్సిక్ లేబొరేటరీ నివేదికలు వచ్చిన తర్వాత… కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులకు పంపించాలని సూచించింది.

 

Related posts