తెలంగాణలోని ములుగులోఈ-హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్ట్ని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టును ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ప్రారంభించాం. ఇది దేశంలోనే ఎక్కడా లేదు.
అభివృద్ధి చెందిన అమెరికా, యూరప్ వంటి దేశాల్లో అమల్లో ఉంది. అటువంటి కార్యక్రమాన్ని40 రోజుల్లో ములుగు జిల్లాలో హెల్త్ ప్రొఫైల్ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ధేశించారు.
ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరించేందుకు సీఎం కేసీఆర్ దీనిని చేపట్టారు. దేశంలోనే ఒక గిరిజన జిల్లా ములుగులో ఈ హెల్త్ ప్రొఫైల్ ప్రారంభించడం అరుదైన గౌరవం, రికార్డు అని మంత్రులు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు ములుగు జిల్లాపై, గిరిజన పట్ల ఉన్న ప్రేమకు ఇది నిదర్శనం అని అన్నారు.
సిరిసిల్ల, ములుగులో 40 రోజుల్లో ప్రజల ఆరోగ్య వివరాలను సేకరించి హెల్త్ ఫ్రొఫైల్ను రూపొందించనున్నట్లు వెల్లడించారు. అందుకోసం 197 మెడికల్ టీమ్స్ను ఏర్పాటు చేశాం. రూ.10 కోట్లు ప్రాథమికంగా విడుదల చేశామని తెలిపారు. ఇంటింటికీ వెళ్లి అన్నిరకాల పరీక్షలు చేస్తారు. వాళ్ల వివరాలన్నీ వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయి.
అంతేకాకుండా వాళ్లకు డిజిటల్ ఐడీ కార్డు ఇస్తామని, అనారోగ్యంతో ఏదైనా హాస్పిటల్ వెళ్లినప్పుడు ఈ ఐడీ చెబితే సరిపోతుంది. ఒకవేళ ఐడీ లేకపోతే… మన వివరాలు తీసుకుని హాస్పిటల్ వాళ్లే ఐడీ క్రియేట్ చేసి ఇస్తారు. డిజిటల్ హెల్త్ కార్డ్ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు వీలు కలుగుతుందని హరీశ్రావు వివరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ ఎర్రబెల్లి దయాకరరావు, శ్రీమతి సత్యవతి రాథోడ్, ఎంపి శ్రీమతి మలోతు కవిత, ఎమ్మెల్యే శ్రీమతి సీతక్క, Tsmsidc ఛైర్మెన్ శ్రీ ఎర్రోళ్ల శ్రీనివాస్, డిహెచ్ శ్రీ శ్రీనివాస్ రావు, జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు

