హైదరాబాద్ పాత బస్తీలోని చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయ అమ్మవారికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు శుక్రవారం దర్శించుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కరోనా నుంచి త్వరగా కోలుకుని ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ భాగ్యలక్ష్మి దేవాలయంలో కాంగ్రెస్ నేతలు ప్రతేక పూజలు చేశారు.
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సీనియర్ నేత వి. హనుమంతరావు, ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, తదితరులు ఇవాళ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు .
అనంతరం కాంగ్రెస్ నేతలు మీడియాతో సీఎల్పీ నేత మల్లు భట్టి మాట్లాడారు.. హిందూవులు అసహ్యించుకొనేలా బీజేపీ నేతలు ప్రవర్తిస్తున్నారన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారు అందరి దేవత అని ఆయన అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీ నేతలు లబ్దిపొందాలని చూస్తున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఈ విషయమై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
బండి సంజయ్ పుట్టక ముందు నుండే కాంగ్రెస్ నేతలు అమ్మవారికి పూజలు చేశారు. భాగ్యలక్ష్మి దేవాలయం బండి సంజయ్ కి ఏమైనా రాసిచ్చారా? ఆయన జాగీరు కాదు. మతాల మధ్య చిచ్చు పెట్టే, విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలి. లేకుంటే తెలంగాణ ప్రజలు బండి సంజయ్ కి బుద్ధి చెబుతారని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.
వీహెచ్ మాట్లాడుతూ… భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని తీసివేస్తామని ఎవరు అన్నారని ప్రశ్నించారు. సోనియా గాంధీ కోలుకోవాలని భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేసినట్టుగా వీహెచ్ చెప్పారు. మేం పుట్టి పెరిగింది ఇక్కడే మాకు కథలు చెప్పొద్దని వీహెచ్ బండి సంజయ్ కి హితవు పలికారు.