ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు టీడీపీ మద్దతు తెలిపారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు. సామాజిక న్యాయానికే తొలి నుంచి టీడీపీ కట్టుబడి ఉందని చంద్రబాబు తెలిపారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలన్న అంశంపై ఇప్పటిదాకా టీడీపీ ఎటూ తేల్చని సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్కు సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో ఈ విషయంపై చర్చించేందుకు పార్టీ అధినేత భేటీని నిర్వహించారు.
ఇప్పటికే ఏపీలో అధికార పక్షం వైఎస్ఆర్ సీపీ ద్రౌపది ముర్మూకే మద్దతు పలికిన సంగతి తెలిసిందే. బీజేపీ అభ్యర్థిని ఖరారు చేయగానే, వారు మద్దతు ప్రకటించారు. గత ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి దానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన టీడీపీ, మళ్లీ ఎన్డీఏకే మద్దతు పలకడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మరోవైపు విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో ఉన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలన్నీ కలిపి యశ్వంత్ సిన్హాను ద్రౌపది ముర్ముకు ప్రత్యర్థిగా నిలిపాయి. అయితే, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ యశ్వంత్ సిన్హాకు మద్దతు పలికిన సంగతి తెలిసిందే.
ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపదీ ముర్మూ బరిలో నిలవగా.. విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు.