పాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ 17వ సీజన్ లో ఫైనల్లోకి దూసుకెళ్లింది.
రాజస్థాన్ రాయల్స్ తో చెన్నైలో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్ లో సన్ రైజర్స్ 36 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
ఈ విజయంతో ఫైనల్ చేరిన సన్ రైజర్స్ ఈ నెల 26న జరిగే టైటిల్ సమరంలో కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది.
ప్లేఆఫ్స్ లో కోల్ కతాతో క్వాలిఫయర్-1లో ఓడిపోయిన సన్ రైజర్స్ ఫైనల్లో ప్రతీకారం తీర్చుకుంటుందా అనే అంశం ఆసక్తి కలిగిస్తోంది.
ఫైనల్ మ్యాచ్ కూడా చెన్నైలోనే జరగనుంది.
ఇక నేటి క్వాలిఫయర్-2 మ్యాచ్ విషయానికొస్తే చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులు చేసింది.
అనంతరం లక్ష్యఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.
సన్ రైజర్స్ స్పిన్నర్లు షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ ను మలుపుతిప్పారు.
కెప్టెన్ పాట్ కమిన్స్ 1, టి.నటరాజన్ 1 వికెట్ తీసి జట్టు విజయంలో తమ వంతు సహకారం అందించారు.
రాజస్థాన్ ఇన్నింగ్స్ లో ధ్రువ్ జురెల్ 56 (నాటౌట్) పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 42 పరుగులు చేశాడు.
ఓపెనర్ టామ్ కోహ్లర్ కాడ్మోర్ (10), కెప్టెన్ సంజు శాంసన్ (10), రియాన్ పరాగ్ (6), రవిచంద్రన్ అశ్విన్ (0), షిమ్రోన్ హెట్మెయర్ (4), రోమాన్ పావెల్ (6) విఫలమయ్యారు.
ప్రచారానికి డబ్బులు లేవు .. కిడ్నీ అమ్ముకుంటా