ఏపీ రాజధాని అమరావతి గురించి కొందరు రాష్ట్ర మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి విమర్శించారు. అమరావతి పరిధిలోని తుళ్లూరులో బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీ రాజధానిని మార్చడం చెప్పినంత సులువు కాదని అన్నారు.
అమరావతి గురించి ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అమరావతిలో ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు జరిగాయని చెప్పారు. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఇచ్చిన అనుమతితోనే అమరావతి నిర్మాణం జరిగిందనే విషయాన్ని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. రాజధానిపై నెలకొన్న గందరగోళ పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు.