*లోన్ యాప్ ఆగడాలపై ఏపీ సర్కార్ సీరియస్
*రాజమండ్రిలో దంపతులు సుసైడ్పై స్పందించిన సీఎం జగన్
*తేజస్వి, లిఖిత శ్రీలకు చేరో 5లక్షలు ఆర్థికసాయం
*పిల్లలు సంరక్షణ కోసం ఏర్పాట్లు చేయమని అధికారులకు ఆదేశం జారీ
*ఆర్బీఐ అనుమతి లేని యాపల్పై కఠిన చర్యలు
లోన్యాప్ ఆగడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. ఆర్బీఐ అనుమతి లేని లోన్యాప్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ అధికారులకు ఏపీ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది.
లోన్యాప్ వేధింపులతో రాజమహేంద్రవరంలో దంపతులు సుసైడ్ చేసుకున్నఘటనపై సీఎం జగన్ చలించిపోయారు. తల్లిదండ్రుల మృతితో అనాథలైన పిల్లలు నాగసాయి 4, లిఖిత 2, ఇద్దరికి చెరో రూ.5లక్షలు సాయం అందించాలని సీఎం ఆదేశించారు. అంతేకాకుండా చిన్నారుల సంరక్షణకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు.
లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఉమ్మడి రాజమహేంద్రవరంలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజబొమ్మంగికి చెందిన కొల్లి దుర్గాప్రసాద్, రమ్యలక్ష్మి దంపతులు రాజమహేంద్రవరంలోని శాంతినగర్ లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. దుర్గాప్రసాద్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. రమ్యలక్ష్మి కుట్టుపని చేస్తూ భర్తకు చేదోడు వాదోడుగా ఉంటుంది.
అయితే కొద్ది రోజుల క్రితం తమ కుటుంబ అవసరాల నిమిత్తం దుర్గాప్రసాద్ దంపతులు లోన్ యాప్ ద్వారా రూ. 50వేలను అప్పుగా తీసుకున్నారు. ఈ అప్పును సకాలంలో చెల్లించకపోవడంతో.. వడ్డీ పెరిగింది. దీంతో తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించాలని లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు గురి చేశారు. ఇటీవల కాలంలో ఈ వేధింపులు మరింత తీవ్రమయ్యాయి. లోన్ డబ్బులు చెల్లించకపోతే ‘‘మీ నగ్న వీడియోలను అందరికి పంపుతాం’’ అని లోన్ యాప్ నిర్వాహకులు రమ్యలక్ష్మిని బెదిరించారు. అలాగే దుర్గాప్రసాద్ అప్పు తీసుకున్న విషయాన్ని అతని స్నేహితులకు, బంధువులకు ఫోన్ చేసి చెప్పారు.
లోన్ తీర్చే మార్గం లేకపోవడం, బంధువుల వద్ద పరువుపోయిందని భావించిన దుర్గాప్రసాద్ దంపతులు తీవ్ర మనస్తాపం చెందారు. ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. పిల్లలను ఇంటి వద్దే వదిలేసి.. రాజమండ్రిలోని ఓ లాడ్జీలో పురుగుల మందు తాగారు. తాము లాడ్జీలో పురుగుల మందు తాగిన విషయాన్ని బంధువులకు పోన్ చేసి చెప్పారు. వెంటనే వారు లాడ్జీకి వెళ్లి పురుగుల మందు తాగిన దంపతులను ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దుర్గాప్రసాద్, రమ్యలక్ష్మి మరణించారు. ఈ ఘటనపై మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

