telugu navyamedia
సినిమా వార్తలు

పరిమళించిన ఎస్.జానకి పాటల పూదోట..

సమాజ సేవకులను గాయకులను ఒకే వేదిక పై సన్మానించడం గొప్ప స్ఫూర్తి సంప్రదాయమని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు అన్నారు. లివింగ్ లెజెండ్ సింగర్ ఎస్.జానకి గారి స్వరం లో నవరసాలు అద్భుతంగా పలుకుతామని కితాబునిచ్చారు. శనివారం రవీంద్రభారతి లో ప్రాగ్నిక ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యం లో వెండి వెలుగులు శీర్షిక తో గాయని ఎస్.జానకి గారి పాటల స్వరాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రముఖ గాయని శ్రీమతి సురేఖా మూర్తి గారిని ఎస్.జానకి వాయిస్ ఆఫ్ ఇండియన్ ప్రైడ్ పురస్కారం తో ఘనంగా సత్కరించారు. అలాగే ప్రముఖ సామాజికవేత్త, బహుజనుల బంధువు, నిరుపేద విద్యార్థుల్లో చైతన్యం తీసుకొచ్చి, ఉచిత శిక్షణ ఇప్పిస్తూ ఐఎఎస్ అధికారులుగా తీర్చిదిద్దుతున్న విద్యావేత్త ఐఆర్టిఎస్ విశ్రాంత రైల్వేస్ అధికారి శ్రీ ఎ.భరత్ భూషణ్ గారిని మహా సేవా చక్రవర్తి బిరుదుతో సన్మానించారు. యువ గాయకులు సుజాత ను జానకి గ్లోరియస్ అవార్డు తో, విశాఖ కు చెందిన ఇందునయన ను జానకి ఎక్స్ లెన్స్ పురస్కారం తో సత్కరించి అభినందించారు.

సీల్వెల్ కార్పొరేషన్ సిఎండి శ్రీ బండారు సుబ్బారావు గారు, వికారాబాద్ కు చెందిన శ్రీ సద్గురు సాయిరాం హాస్పిటల్ అధినేత శ్రీ కె.సత్యనారాయణ గౌడ్ ఆశీస్సులతో ఈ వేడుక జరిగింది. తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి డాక్టర్ ఎస్.వేణుగోపాలాచారి, సరస్వతి ఉపాసకులు శ్రీ దైవజ్ఞ శర్మ, డాక్టర్ మహ్మద్ రఫీ, కల్చరల్ టివి శ్రీ ఎన్.పురుషోత్తం గౌడ్, సినీ సంగీత దర్శకుడు శ్రీ కె.ఎం.రాధాకృష్ణన్, శ్రీ కె.బందయ్య గౌడ్, ఇన్ కం టాక్స్ ఉన్నతాధికారి శ్రీ ఎల్.మోహన్, గాయకుడు శ్రీ చంద్రతేజ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ పి.ఎం.కె.గాంధి వ్యాఖ్యాత గా వ్యవహరించారు. శ్రీ ప్రవీణ్ కుమార్, శ్రీమతి పారిజాత సమన్వయకర్తలుగా వ్యవహరించారు.

ఆరు గంటల పాటు కొనసాగిన సినీ సంగీత విభావరి లో జానకి పాడిన పాటలను శ్రీ ప్రవీణ్ నేతృత్వం లో శ్రీమతి సురేఖా మూర్తి, సుజాత, ఇందు నయన, రాధ, శ్రీ పసుల లక్ష్మణ్, జనాబ్ ఎస్.ఖాదర్, శ్రీ సింహ ఆలపించి ఆద్యంతం అలరించారు.

Related posts