దేశంలో ఆర్టీసీ కార్మికులకు అత్యధిక జీతాలు టీఎస్ఆర్టీసీ అని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎక్కడాలేని విధంగా ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చామని, 16 శాతం ఐఆర్ కూడా ఇచ్చామని మంత్రి గుర్తుచేశారు. శనివారం సంగారెడ్డి జిల్లా నారాయణ్ఖేడ్లో పర్యటించిన మంత్రి మీడియాతో మాట్లాడారు. పండుగ ముందు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడాన్ని మంత్రి తప్పుపట్టారు. ఇలాంటి సమయంలో సమ్మె చేయడం సరైనది కాదని కార్మికులపై అసహనం వ్యక్తం చేశారు.
ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సింది పోయి.. బతుకమ్మ, దసరా పండుగలోస్తే సమ్మె చెస్తామంటే ఎలా అని మంత్రి ప్రశ్నించారు. ఇప్పటికే ఐదు వేల కోట్ల నష్టాల్లో ఆర్టీసీ ఉందని.. ఏటా 11 వందల కోట్ల రూపాయల నష్టం జరుగుతున్నా ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేవని, యూనియన్ లీడర్లే కుట్రపూరితంగా ఆర్టీసీ సమ్మె చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

