కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్ లో మే 4 నుంచి చాలా జిల్లాల్లో చెప్పుకోతగ్గ సడలింపులు ఉంటాయని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన నూతన విధానం, నియమ నిబంధనలు అతి త్వరలోనే విడుదల అవుతాయని హోమ్ శాఖ తన అధికార ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.
“లాక్ డౌన్ పై సమగ్ర సమీక్ష జరిపిన తరువాత, పరిస్థితిలో చాలా మార్పు వచ్చిందని, లాక్ డౌన్ సత్ఫలితాలను ఇచ్చిందని గుర్తించాము. ఈ ఫలితాలను పోగొట్టుకోకుండానే, భవిష్యత్తులో ముందుకు సాగాలి. మే 3 వరకూ ప్రస్తుత నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందే” అని ట్వీట్ చేశారు. కరోనా తగ్గిన చాలా జిల్లాలలో వెసులుబాటు ఉంటుందని, త్వరలోనే ఈ వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.