భారత్ ఎప్పటికీ పాకిస్థాన్ వంటి మత రాజ్యంగా మారదని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఢిల్లీలో ఎన్ సీసీ రిపబ్లిక్ డే క్యాంప్ నుద్దేశించి ఆయన మాట్లాడుతూ..భారత దేశంలో అన్ని మతాలకు సమాన విలువ ఉందని చెప్పారు. మత ప్రాతిపదికన భారత్ లో వివక్ష ఉండదన్నారు. అన్ని మతాలు సమానమని భారతీయ ధర్మం చాటుతుందని, అందుకే భారత్ లౌకిక దేశంలా కొనసాగుతోందన్నారు. భారత్ ఏ ఒక్క మతాన్ని తమ మతమని ప్రకటించలేదని తెలిపారు. హిందూ, సిక్కు, బౌద్దం.. తదితర మతాలు ఇక్కడ ఉన్నాయన్నారు.
పొరుగుదేశమైన పాకిస్థాన్ మతపరమైన దేశమని ప్రకటించుకున్నదన్నారు. భారత్ అలా ఎన్నడూ చేయదని చెప్పారు. అమెరికా సైతం మత రాజ్యమేనంటూ.. భారత్ మాత్రం మత ప్రమేయంలేని దేశమన్నారు. దేశంలో నివసించే వారంతా ఒకే కుటుంబంగా మనందరం భావిస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రపంచంలో నివసిస్తున్న వారంతా ఒకే కుటుంబమని ఆయన పేర్కొన్నారు.