పవర్స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోల్లో ఒకరు. అలాంటి పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ మంచిదశలో ఉన్నపుడు సినీ రంగం నుంచి పొలిటికల్ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకంగా ఉన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 23వ తేదీన వెల్లడికానున్నాయి. టాలీవుడ్లో ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాలు చేయబోతున్నారని, ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ మైత్రీ మూవీస్ పతాకంలో ఓ చిత్రాన్ని చేయనున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ఈ ఊహాగానాలకు పవన్ కళ్యాణ్ తాజాగా పార్టీ కేడర్తో జరిగిన సమావేశంలో ఓ క్లారిటీ ఇచ్చారు. ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ.. జనసేన పార్టీకి సీట్లు వచ్చినా, రాకపోయినా సరే తాను మాత్రం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని ప్రకటించారు.జనసేన లక్ష్యం 25 యేళ్లు అని, అప్పటివరకు రాజకీయాల్లో ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటానని పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు. సో.. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనే కొనసాగుతారని తేలిపోయింది. ఇకపోతే, పవన్ కళ్యాణ్ నటించిన చివరి చిత్రం అజ్ఞాతవాసి. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.