ఎంతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని జనసేనాని పవన్ కల్యాణ్ కోరారు. కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలిపారు. అసంఘటిత రంగాల్లోని కార్మికుల సంక్షేమం గురించి కూడా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మేడే సందర్భంగా కార్మిక లోకం శ్రమను మరోసారి గుర్తించాలని పవన్ పిలుపునిచ్చారు.
కరోనా కష్టకాలంలో కార్మికులపై సానుభూతి చూపాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఏ దేశ ఆర్థిక రంగ పురోగతికైనా శ్రమజీవుల కష్టించే తత్వమే ప్రధాన ఇంధనం అని స్పష్టం చేశారు. వైరస్ పరిస్థితుల దుష్ప్రభావం కార్మికులపై పడే అవకాశం ఉందని, వారి ఉపాధికి చట్టబద్ధమైన రక్షణ కల్పించడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని సూచించారు.